క్వార్టర్‌ ఫైనల్లో మంజు రాణి 

8 Oct, 2019 08:13 IST|Sakshi

ప్రపంచ మహిళల బాక్సింగ్‌  

ఉలన్‌ ఉడె (రష్యా): ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మంజురాణి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె ప్రిక్వార్టర్స్‌లో 5–0తో వెనిజులాకు చెందిన రోజస్‌ టేవోనిస్‌ను చిత్తుచేసింది. మంజు తన పిడిగుద్దులతో ప్రత్యర్థిని చేష్టలుడిగేలా దెబ్బతీసింది. స్పష్టమైన పంచ్‌లు ఆమెకు పాయింట్లను తెచ్చిపెట్టగా... చతికిలబడిన టేవోనిస్‌ ఖాతా తెరువకుండానే ఓడిపోయింది. ఇప్పుడు ఆమె మరో ‘ప్రపంచ’ పతకానికి కేవలం అడుగు దూరంలో ఉంది.

సెమీస్‌ చేరితే మంజుకు కనీసం కాంస్యం లభిస్తుంది. గత ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్యం నెగ్గిన ఆమెకు క్వార్టర్స్‌లో క్లిష్టమైన ప్రత్యర్థే ఎదురైంది. ఈ నెల 10న జరిగే మ్యాచ్‌లో ఆమె దక్షిణ కొరియాకు చెందిన టాప్‌సీడ్‌ కిమ్‌ హ్యాంగ్‌ మితో తలపడుతుంది. 64 కేజీల బౌట్‌లో మంజు బాంబొరియా 1–4తో అంజెలా కారిని (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూసింది. మంగళవారం జరిగే రెండో రౌండ్లో భారత అగ్రశ్రేణి బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన మేరీకోమ్‌ (51 కేజీలు)... జుటమస్‌ జిట్‌పాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో పోటీపడుతుంది. తొలిబౌట్‌లో మేరీకి ‘బై’ లభించింది. 75 కేజీల విభాగంలో సవీటి ... రెండో సీడ్‌ లారెన్‌ ప్రైస్‌ (వేల్స్‌)తో తలపడనుంది.  


 

మరిన్ని వార్తలు