ఢాకా: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) కప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఫైనల్ చేరింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించింది. భారత్ తరఫున మాన్వీర్ సింగ్ (49వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుమీత్ పస్సీ (83వ ని.లో) ఓ గోల్ చేశాడు.
పాక్ తరఫున హసన్ బషీర్ (88వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మరో సెమీఫైనల్లో మాల్దీవులు 3–0తో నేపాల్పై గెలిచింది. శనివారం జరుగనున్న తుదిపోరులో మాల్దీవులుతో భారత్ తలపడనుంది.