-

టి20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకోండి

25 May, 2020 02:05 IST|Sakshi

ఐసీసీని కోరిన ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌

మెల్‌బోర్న్‌: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ జరిగే అవకాశాలు కనిపించడంలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడ్డాడు. ఈనెల 28న అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బోర్డు మీటింగ్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టేలర్‌ కోరాడు. ‘ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ తదుపరి ప్రణాళిక చేసుకుంటారు. ఒకవేళ ప్రపంచకప్‌ వాయిదా పడితే అవే తేదీల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశముంది. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసీస్‌ బోర్డు తమ దేశ క్రికెటర్లకు అనుమతి ఇస్తుందనడంలో సందేహం లేదు. బీసీసీఐని సంతోషంగా ఉంచేందుకు ఆస్ట్రేలియా బోర్డు ప్రయత్నిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన యధావిధిగా కొనసాగితే ఆసీస్‌ బోర్డుకు ఎంతో లాభం చేకూరుతుంది’ అని టేలర్‌ అన్నాడు. 

మరిన్ని వార్తలు