బీసీసీఐ ఓ సెల్ఫీష్‌ : ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

16 May, 2018 18:17 IST|Sakshi
బీసీసీఐ చిహ్నం

సిడ్నీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనను తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ మార్క్‌ వా తప్పుబట్టాడు. టెస్ట్‌ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరించందన్నాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని, ఈ దేశాలతో టెస్ట్‌ క్రికెట్‌కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నామని వా ఓ రేడియో చానెల్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత జట్టులో సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్‌, స్పిన్నర్లు, పేసర్లతో పటిష్టంగా ఉండగా అసలు బీసీసీఐ డే/నైట్‌ టెస్టుకు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావడలేదన్నాడు. టీమిండియాకు డే/నైట్‌ టెస్టులు సరిగా సరిపోతాయన్నాడు. డే/నైట్‌ టెస్టులు చూడటం తాను ఇష్టపడతానని తెలిపాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ సైతం ఇదే విధంగా బీసీసీఐని తప్పుబట్టాడు.

మరోవైపు  మార్క్‌ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్‌ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. ఇక భారత్‌ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల కోసం నవంబర్‌ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.   

డే/నైట్‌ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్‌ ఆస్ట్రేలియా డే/నైట్‌ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు