‘అతని బౌలింగ్‌ను నిలువరిస్తాం’

17 Jul, 2018 15:15 IST|Sakshi

హెడింగ్లీ: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తొమ్మిది వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆరు వికెట్లతో మెరిసిన కుల్దీప్‌.. రెండో వన్డేలో మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే కుల్దీప్‌ బౌలింగ్‌పై ప్రధాన దృష్టి సారించింది ఇంగ్లండ్‌. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్‌ యాదవ్‌ను నిలువరిస్తే మ్యాచ్‌ తమ చేతుల్లోకి  తీసుకోవడం సులభం అవుతుందని అంటున్నాడు ఇంగ్లండ్‌ క్రికెటర్‌ మార్క్‌ వుడ్‌. అందుకు సంబంధించిన కచ్చితమైన ప్రణాళికలతో ఇంగ్లండ్‌ మూడో వన్డేలో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశాడు.

ఈ రోజు(మంగళవారం) లీడ్స్‌ మైదానంలో టీమిండియాతో చివరి వన్డేలో తలపడనున్న నేపథ్యంలో మార్క్‌ వుడ్‌ మాట్లాడుతూ..‘ కుల్దీప్‌ ఆరంభ ఓవర్లలోనే వికెట్లను సాధిస్తున్నాడు. అది మ్యాచ్‌ ఫలితంలో కీలకంగా మారడంతో పాటు అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కుల్దీప్‌ బౌలింగ్‌ను మా బ్యాట్స్‌మెన్‌ నిర్వీర్యం చేస్తే అతనిపై ఒత్తిడి తీసుకురావచ్చు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఆఖరి వన్డేలో కుల్దీప్‌ మ్యాజిక్‌ను మా ఆటగాళ్లు అడ్డుకుంటారనే అనుకుంటున్నా. ముఖ్యంగా కుల్దీప్‌ ఆరంభపు ఓవర్లలో వికెట్లు సమర‍్పించుకోకుండా జాగ్రత్త పడటమే మా గేమ్‌ ప్లాన్‌లో భాగం. అదే సమయంలో దూకుడుగా ఆడితేనే అతడి బౌలింగ్‌లో పరుగులు చేయగలం. అలా కుల్దీప్‌ బౌలింగ్‌ను తిప్పికొట్టాడానికి సన్నద్ధమయ్యాం’ అని మార్క్‌వుడ్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు