మార్క్‌రమ్‌ మెరుపు శతకం

28 Sep, 2019 04:36 IST|Sakshi

దక్షిణాఫ్రికా 199/5

అర్ధశతకంతో రాణించిన బవుమా

బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌తో మ్యాచ్‌

సాక్షి ప్రతినిధి విజయనగరం: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్‌ మార్క్‌రమ్‌ (118 బంతుల్లో 100 రిటైర్డ్‌ ఔట్‌; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫామ్‌ చాటుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవెన్‌తో విజయనగరంలో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో రెండో రోజు అతడు సెంచరీ కొట్టాడు. ఇటీవల భారత్‌ ‘ఎ’ జట్టుపై భారీ శతకం (160) బాదిన అతడు... ఈ మ్యాచ్‌లోనూ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. మైదానం ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మ్యాచ్‌ ప్రారంభమైంది. 50 ఓవర్ల అనంతరం వెలుతురు లేమి తో ముందే నిలిపివేశారు. కీలక బ్యాట్స్‌మెన్‌ టెంబా బవుమా (92 బంతుల్లో 55 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో సఫారీలు రోజు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా... ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (6)ను ఏడో ఓవర్లోనే ఉమేశ్‌ యాదవ్‌ వెనక్కు పంపాడు. డి బ్రుయెన్‌ (6)ను ఇషాన్‌ పొరెల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో జుబయిర్‌ హమ్జా (22)తో కలిసి మార్క్‌రమ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సెంచరీ పూర్తయ్యాక మార్క్‌రమ్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. కెపె్టన్‌ డు ప్లెసిస్‌ (9)ను ధర్మేంద్ర జడేజా ఎల్బీ చేశాడు.  మ్యాచ్‌కు శనివారం చివరి రోజు. దక్షిణాఫ్రికా ఇదే స్కోరు వద్ద డిక్లేర్‌ చేసి బోర్డు జట్టు బ్యాటింగ్‌కు వీలు కల్పించనుంది. తద్వారా టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా చూసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు