సెంచరీతో కివీస్‌ను గెలిపించిన గప్టిల్‌

17 Feb, 2019 01:11 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (88 బంతుల్లో 118; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బంగ్లాదేశ్‌పై మళ్లీ శతక్కొట్టాడు. దీంతో శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌ నెగ్గిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్‌లో మిథున్‌ (57; 7 ఫోర్లు, 1 సిక్స్‌), షబ్బీర్‌ రహ్మాన్‌ (43; 7 ఫోర్లు) రాణించారు.

కివీస్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 3, ఆస్టల్, నీషమ్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్‌ 36.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది. తొలి వన్డేలో అజేయ సెంచరీ బాదిన గప్టిల్‌ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో వికెట్‌కు కెప్టెన్‌ విలియమ్సన్‌ (65 నాటౌట్‌; 3 ఫోర్లు)తో కలిసి 143 పరుగులు జోడించాడు. అనంతరం టేలర్‌ (21 నాటౌట్, 3 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్‌ మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు.  

మరిన్ని వార్తలు