ఆరో స్వర్ణం మేరీ సొంతం

24 Nov, 2018 16:41 IST|Sakshi

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ విజేత మేరికోమ్‌

చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ బాక్సర్‌

ఫైనల్లో హనా ఒఖోటాను మట్టికరపించిన మేరీ

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మట్టి కరిపించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. దీంతో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్‌ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్‌ ఇప్పుడు ఆమెను అధిగమించింది.

తాజా స్వర్ణంతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్‌ దిగ్గజం ఫెలిక్స్‌ సవాన్‌ సరసన చేరింది. మేరీ 2002, 2005, 2006, 2008, 2010 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలతో పాటు.. అరంగేట్ర 2001 చాంపియన్‌ షిప్‌లో రజతం సాధించింది. గెలుపునంతరం ఆమె భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గత కొన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యంగా పేర్కొంది. 

వైఎస్‌ జగన్‌ అభినందనలు..
ఆరు స్వర్ణాలతో ప్రపంచ రికార్టు సృష్టించిన మేరికోమ్‌కు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు