మా జట్టు ఓటమికి నేనే కారణం: కెప్టెన్‌

8 Jul, 2019 11:32 IST|Sakshi

‘ఈ ప్రపంచకప్‌లో మిమ్మల్ని మేం అసంతృప్తికి గురిచేశాం. మీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాం. అందుకు చింతిస్తున్నాం’ అంటూ బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తాజా ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్‌కప్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమై.. అభిమానులను, మద్దతుదారులను నిరాశకు గురిచేశామని, ప్రపంచకప్‌లో ఓటమికి తనదే బాధ్యత అని మొర్తాజా ప్రకటించారు. ఒకింత పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించకుండానే బంగ్లాదేశ్‌ జట్టు వెనుదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ నుంచి ఢాకా చేరుకున్న అనంతరం మొర్తాజా విలేకరులతో మాట్లాడారు.

‘మొత్తంగా చూసుకుంటే మా ఆటతీరు సానుకూలంగానే ఉంది. కానీ మామీద ఉంచిన అంచనాలను అందుకోలేకపోయాం. కొన్ని ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చి ఉంటే.. మేం సెమీఫైనల్‌కు చేరేవాళ్లం. ఒకవేళ చివరి మ్యాచ్‌లో గెలిచినా.. టాప్‌ ఐదో స్థానంలో ఉండేవాళ్లం. కానీ, మేం సెమీస్‌కు రావాలని ప్రేక్షకులంతా కోరుకున్నారు. దురుదృష్టవశాత్తు అది జరగలేదు’ అంటూ మొర్తాజా పేర్కొన్నారు. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచి.. ప్రపంచకప్‌ లీగ్‌ దశలోనే బంగ్లాదేశ్‌ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ జట్లను ఓడించిన బంగ్లా.. పలు టాప్‌ టీమ్‌లతో హోరాహోరీగా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌, పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోవడం, దక్షిణాఫ్రికా చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంతో బంగ్లా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.

‘భారత్‌తో మ్యాచ్‌ వరకు మాకు సెమీస్‌ అవకాశాలు సజీవంగా నిలిచాయి. కానీ, షకీబుల్‌ హసన్‌, ముష్ఫిక్‌ రహీం తప్ప మిగతా ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం తమ అవకాశాలను దెబ్బతీసిందని మొర్తాజా వాపోయాడు.ఈ వరల్డ్‌కప్‌లో షకీబుల్‌, ముష్ఫిక్‌తోపాటు ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ సైఫుద్దీన్‌ కూడా అద్భుతంగా రాణించాడని కొనియాడాడు.

మరిన్ని వార్తలు