లండన్: ఎన్నోసార్లు ప్రపంచ క్రికెట్ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ జాఢ్యం టెన్నిస్కూ పాకింది. గత దశాబ్దకాలంగా ప్రపంచ టాప్-50 టెన్నిస్ క్రీడాకారుల్లో 16 మందికి ఫిక్సింగ్లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో గ్రాండ్ స్లామ్ విజేతలు కూడా ఉన్నారు. ప్రపంచ టెన్నిస్లో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందని, దీనికి సంబంధించిన రహస్య ఫైళ్లు తమ దగ్గర ఉన్నాయని బీబీసీ, బజ్ఫీడ్ న్యూస్ వెల్లడించాయి.
2016 సీజన్లో తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభంకానున్న తరుణంలో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. 2007లో ఏటీపీ ఏర్పాటు చేసిన విచారణ బృందం నివేదికలోని వివరాలు తమ దగ్గర ఉన్నాయని బీబీసీ, బజ్ఫీడ్ వెల్లడించాయి. రష్యా, ఇటలీలలో బెట్టింగ్ ముఠాలున్నాయని, కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగిందని, కొన్ని మ్యాచ్లను ఫిక్సింగ్ చేసినట్టుగా భావిస్తున్నట్టు తెలిపాయి. 2008లో 28 క్రీడాకారుల ప్రమేయంపై విచారణ జరిగినట్టు బీబీసీ పేర్కొంది. 2009లో కొత్త అవినీతి వ్యతిరేక కోడ్ను ప్రవేశపెట్టాక, అంతకుముందు ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోలేదని వెల్లడించింది.
గ్యాంబ్లర్లు మేజర్ టోర్నమెంట్లలో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునేవాళ్లని, వారు బస చేసిన హోటళ్లలో సంప్రదించేవారని, ఫిక్సింగ్ చేయడానికి లక్షలాది రూపాయలను ఆఫర్ చేసేవారని బజ్ఫీడ్ వెల్లడించింది. కాగా అవినీతిని అరికట్టడంలో ఎలాంటి అలసత్వం చూపలేదని టెన్నిస్ అధికారులు బెబుతున్నారు. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోలేదని ఏటీపీ చీఫ్ క్రిస్ కెర్మొడె చెప్పారు. కాగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న క్రీడాకారుల పేర్లను బీబీసీ, బజ్ఫీడ్ బయటపెట్టలేదు.