మాథ్యూస్‌కు వెల్‌కమ్‌.. చండిమల్‌కు బైబై

18 Apr, 2019 17:10 IST|Sakshi

కొలంబో: వచ్చే నెలలో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇప్పటికే లసిత్‌ మలింగాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించి దిముత్‌ కరుణరత్నేను సారథిగా నియమించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు.. తాజాగా పూర్తి జట్టును ప్రకటించింది. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ను తిరిగి జట్టులోకి తీసుకోగా, గత కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న చండిమల్‌కు ఉద్వాసన పలికింది. అదే సమయంలో మలింగాను సైతం జట్టులో ఎంపిక చేసింది.

గత కొన్నాళ్లుగా మోచేతి గాయం కారణంగా జట్టుకు దూరమైన మాథ్యూస్‌.. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్‌ సెలక్షన్‌ ట్రయల్‌లో భాగంగా దంబుల్లా తరఫున కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడిన మాథ్యూస్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. దాంతో మాథ్యూస్‌ ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. మరొకవైపు చండిమల్‌ పేలవమైన ఫామ్‌తో వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

శ్రీలంక వరల్డ్‌కప్‌ జట్టు ఇదే.. దిముత్‌ కరుణరత్నే(కెప్టెన్‌), అవిష్కా ఫెర్నాండో, లహిరు తిరుమన్నే, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌, ధనుంజయ డిసిల్వ, జీవన్‌ మెండిస్‌, మిలింద్‌ సిరివర్దనా, ఏంజెలో మాథ్యూస్‌, తిషారా పెరీరా, ఇసురు ఉదానా, లసిత్‌ మలింగా, సురంగా లక్మల్‌, జెఫ్రీ వాండర్సే, నువాన్‌ ప్రదీప్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు.. ఒషాదా ఫెర్నాండో, కసున్‌ రజితా, హసరంగా, ఏంజెలో పెరీరా

మరిన్ని వార్తలు