న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్లు రెగ్యులర్ స్పిన్నర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో ఎవరు అత్యుత్తమం అనే విషయంపై ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ స్పందించాడు. చహల్ కంటే కుల్దీప్ యాదవ్ ఎక్కువ ప్రమాదకరమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. గాల్లోనే బంతి దిశను మార్చే కుల్దీప్ యాదవ్ చాలా ప్రమాదకరమైన స్పిన్నర్గా హేడెన్ పేర్కొన్నాడు.
‘ఆఫ్ స్పిన్నర్లకన్నా లెగ్ స్పిన్నర్లకు వైవిధ్యంగా బౌలింగ్ చేసే అవకాశమెక్కువ. షేన్ వార్న్ తరహాలో బంతిని గాల్లోనే దిశ మార్చేలా బౌలింగ్ చేయగల సత్తా కుల్దీప్ సొంతం. ఇదే అతడి ప్రధాన బలం. ఇక, చహల్ ఎక్కువగా వికెట్ టు వికెట్ బంతులు విసిరేందుకు ఇష్టపడతాడు. కానీ కుల్దీప్లాగా గాల్లోనే బంతి దిశను మార్చలేడు. అందుకే నేనిప్పుడు ఆడి ఉంటే చహల్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకే ఇష్టపడతా. నా దృష్టిలో కుల్దీప్ను ఆడటం కష్టం’ అని అన్నాడు.