మయాంక్‌ మరో రికార్డు

3 Jan, 2019 10:15 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ మరో ఘనత సాధించాడు. గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి (76,42) 118 పరుగులు చేసి విదేశీ గడ్డపై అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్‌ ఆటగాడిగా నిలిచిన మాయాంక్‌.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. ఆసీస్‌తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాయంక్‌ అగర్వాల్‌(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ విఫలమైనప్పటికీ మయాంక్‌ మాత్రం సొగసైన షాట్లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఫలితంగా తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థ శతకాలు సాధించిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ జాబితాలో సునీల్‌ గావస్కర్‌, పృథ్వీషాలు ఉండగా, ఇప్పుడు వారి సరసన మయాంక్‌ నిలిచాడు. మరొకవైపు ఆస్ట్రేలియాలో కనీసం రెండు హాఫ్‌ సెంచరీలు ఎనిమిదో టీమిండియా ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాలు ఆరంభించారు. కాగా, రాహుల్‌(9) మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో షాన్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో చతేశ్వర్‌ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు మయాంక్‌. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమం‍లోనే పుజారా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే టీ బ్రేక్‌ తర్వాత విరాట్‌ కోహ్లి(23)  ఔట్‌ కావడంతో భారత్‌ 180 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!

మరిన్ని వార్తలు