మయాంక్‌ 220... పృథ్వీ షా 136 

6 Aug, 2018 01:13 IST|Sakshi

భారత్‌ ‘ఎ’ 411/2

దక్షిణాఫ్రికా ‘ఎ’ 246 ఆలౌట్‌

బెంగళూరు: ఫామ్‌లో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌ (250 బంతుల్లో 220 బ్యాటింగ్‌; 31 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీకి తోడు... యువ సంచలనం పృథ్వీ షా (196 బంతుల్లో 136; 20 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ భారీ స్కోరు చేసింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్‌ 165 పరుగుల ఆధిక్యంలో ఉంది. మయాంక్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 246/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఓవర్‌లోనే మిగతా రెండు వికెట్లు కోల్పోయి అదే స్కోరు వద్ద ఆలౌటైంది. ఆ రెండు వికెట్లు హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (5/56) పడగొట్టాడు.
 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో సఫారీ బౌలర్లు చూస్తుండిపోయారు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేసిన వీరిద్దరు శతకాలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 277 పరుగులు జోడించింది. వీరిద్దరు కలిసి 58 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టడం విశేషం. అనంతరం పృథ్వీ అవుటైనా... సమర్థ్‌ ( 37; 5 ఫోర్లు)తో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించాడు. ఈ జంట రెండో వికెట్‌కు 118 పరుగులు జతచేసింది.  
 

>
మరిన్ని వార్తలు