ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్‌

4 Jun, 2018 21:17 IST|Sakshi

బెంగళూరు : కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌, కర్టాటక రంజీ ప్లేయర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి అషితా సుధ్‌ను వివాహమాడాడు. ఈ పెళ్లికి టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మయాంక్‌ ఆగర్వాల్‌తో పాటు స్నేహితులతో దిగిన ఫొటోలను కేఎల్ రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఐదు నెలల క్రితం ఆషిత సూద్‌‌కు మయాంక్ అగర్వాల్ ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. అషితా ఒప్పుకోవడం... ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సైతం వీరి పెళ్లికి అంగీకరించడంతో అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మయాంక్ అగర్వాల్‌ పంజాబ్‌ తరుపున మొత్తం 11 మ్యాచ్‌లాడి 120 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌ ఆరంభంలో మంచి ప్రదర్శన కనబర్చిన పంజాబ్‌ ఆ తర్వాత వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో మయాంక్‌ అద్భుత ప్రదర్శన చేసినప్పటికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులో చోటు దక్కలేదు. రంజీల్లో కర్ణాటక తరపున బరిలోకి దిగిన మయాంక్‌ అగర్వాల్ ఈ ఏడాది రంజీల్లో 2,141 పరుగులు సాధించాడు. దీంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మన్‌గా అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు