ఓవర్‌ త్రోపై షేన్‌ వార్న్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

21 Aug, 2019 17:45 IST|Sakshi

క్రికెట్‌లో ఓవర్‌ త్రో సహజం. కానీ ఆ ఒక్క ఓవర్‌ త్రో న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ను దూరం చేసింది. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో గప్టిల్‌ విసిరిని బంతి స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు కేటాయించారు. ఈ ఓవర్‌ త్రో కివీస్‌ ఓటమికి ప్రధాన కారణమైంది. అయితే అంపైర్‌ ఆరు పరగులు కేటాయించడం పెద్ద వివాదస్పదమైంది. దీంతో మరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎమ్‌సీసీ) ఓవర్‌ త్రో నిబంధనలపై సమీక్ష చేపట్టింది. అయితే ఎమ్‌సీసీ సభ్యుడు, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓవర్‌త్రోపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘ఓవర్‌ త్రో నిబంధనలపై ఎమ్‌సీసీ సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎమ్‌సీసీలో సభ్యుడిగా నా వాదన వినిపించాను. ఫీల్డర్‌ విసిరిన బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ శరీరానికి, బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. అంతేకాకుండా బ్యాట్స్‌మెన్‌ పరుగు కూడా తీయొద్దు. ఎందుకంటే అది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఓవర్‌ త్రో పరుగులు అనేవి మైదానంలో ఉన్న ఫీల్డింగ్‌ జట్టు తప్పిదం వల్లనే రావాలి కానీ.. ఎవరి తప్పిదం లేనప్పుడు వచ్చిన పరుగులను కౌంట్‌ చేయోద్దు అనేది నా వాదన

ఇక ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ను నేను స్వాగతిస్తున్నా. టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ ముందడుగేసింది. అయితే అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు టెస్టు ప్రమాణాలను పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లను కొందరు తప్పుబడుతున్నారు. కానీ అందులో ఏం తప్పు ఉందో అర్థం కావడం లేదు. జెర్సీలపై నంబర్లు, పేర్లు ఉంటే అభిమానులు ఆటగాళ్లను సులువుగా గుర్తుపట్టవచ్చు’అంటూ వార్న్‌ పేర్కొన్నాడు.

చదవండి: 
ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ
నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌
నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌​​​​​​​

మరిన్ని వార్తలు