ఎప్పుడూ ‘టాప్‌’ మీరే కాదు బాస్‌: రబడ

8 Sep, 2019 18:20 IST|Sakshi

ముంబై: కొంతమంది క్రికెటర్లను మాత్రమే మీడియా హైప్‌ చేస్తుందని దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పలువురి క్రికెటర్లకు మీడియాలో లభించిన క్రేజ్‌ను చూస్తే తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో  దక్షిణాఫ్రికా ఆడటానికి సిద్ధమైన వేళ రబడా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌, భారత్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలను మీడియా ఆకాశానికి ఎత్తేస్తుందన్నాడు. అదే సమయంలో కొంతమంది పట్ల నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తుందంటూ ధ్వజమెత్తాడు.

‘ ఆర్చర్‌, బుమ్రాలను నేను కచ్చితంగా అభినందిస్తా.  ఆ ఇద్దరు తక్కువ కాలంలోనే సత్తాచాటి తమ జట్లలో రెగ్యులర్‌ ఆటగాళ్లగా మారిపోయారు. వారు తమ ప్రదర్శనతో ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకున్నారు.  ఆర్చర్‌ది సహజసిద్ధమైన టాలెంట్‌ అయితే, బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. ఇదంతా ఓకే.  కేవలం ఆ ఇద్దరు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం లేదు. నేను కూడా చాలా కాలంగా బాగా ఆడుతున్న విషయం నాకు తెలుసు. ఎప్పుడూ ఆ ఇద్దరే టాప్‌లో ఉండరని విషయం మాత్రం నేను చెప్పగలను’ అని రబడ పేర్కొన్నాడు.

ఇటీవల విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రబడ రెండో స్థానంలో నిలవగా, బుమ్రా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో బుమ్రా ముఖ్యపాత్ర పోషించడంతో ర్యాంకింగ్‌ను కూడా మెరుగుపరుచుకున్నాడు.  వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా 13 వికెట్లు సాధించాడు.

>
మరిన్ని వార్తలు