రష్యా ఓపెన్‌ సెమీస్‌కు మేఘన

20 Jul, 2019 14:33 IST|Sakshi

వ్లాదివోస్తోక్‌(రష్యా): తెలుగు అమ్మాయి జక్కంపూడి మేఘన రష్యా ఓపెన్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ మేఘన–ధ్రువ్‌ కపిల(భారత్‌) ద్వయం 21–3, 21–12తో స్థానిక జోడీ మస్కిమ్‌ మకలోవ్‌–ఎక్తరినా రియాజన్చెవాను చిత్తు చేసింది. తదుపరి రౌండ్‌లో ఏడో సీడ్‌ అద్నాన్‌ మౌలానా–మిచెల్‌ క్రిస్టీన్‌ బందాసో (ఇండోనేషియా) జోడీతో తలపడుతుంది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ మేఘన– పూర్వీషా రామ్‌(భారత్‌) జోడీ 21–19, 21–11తో విక్టోరియా కొజిరెవా–మారియా సుఖోవా(రష్యా) జంట పై నెగ్గి తుది నాలుగులోకి చేరింది. తదుపరి రౌండ్‌లో నాలుగో సీడ్‌ మికి కషిహర– మియుకి కటో(జపాన్‌) జంటతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ దాస్‌10–21, 21–16, 16–21తో టాప్‌ సీడ్‌ క్రిస్టీ గిల్మోర్‌(స్కాట్లాండ్‌), పురుషుల సింగిల్స్‌లో సిరిల్‌ వర్మ 11–21, 27–29తో ఇషాన్‌ మౌలానా ముస్తఫా (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడారు. దీంతో ఈ రెండు విభాగాల్లో భారత్‌ ప్రస్థానం ముగిసింది. 
 

మరిన్ని వార్తలు