నల్లజాతీయులకు అండగా నలుపు కార్లతో రేస్‌

1 Jul, 2020 00:20 IST|Sakshi

ఎఫ్‌1లో మెర్సిడెజ్‌ జట్టు నిర్ణయం

లండన్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) చాంపియన్‌ జట్టు మెర్సిడెజ్‌ నల్ల జాతీయులకు అండగా... జాత్యాహంకారానికి వ్యతిరేకంగా స్పందిం చింది. 2020 సీజన్‌లో పూర్తిగా తమ కార్లు నలుపుమయం కానున్నాయని ప్రకటించింది. నలుపు రంగు కార్లతో ఫార్ములావన్‌లో తమ రేసర్లు పాల్గొంటారని తెలిపింది. సహజంగా మెర్సిడెజ్‌ సంస్థ ఎప్పుడైనా సిల్వర్‌ కలర్‌ కార్లతో సర్క్యూట్‌లో దూసుకెళ్లెది. అయితే జాత్యాహంకారానికి, నల్లజాతీయులపై దమనకాండకు ముగింపు పలికే కార్యక్రమంలో భాగంగానే తాము ఈ సీజన్‌లో నలుపు కార్లతో బరిలోకి దిగుతున్నామని టీమ్‌ ప్రిన్సిపల్‌ టొటొ వోల్ఫ్‌ వెల్లడించారు. ‘ఇక వర్ణవివక్షపై మౌనముద్ర ఉండదు. ప్రపంచ క్రీడా వేదికపై మా గళం వినిపించేలా.... మా సంకల్పం ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో వస్తున్నాం. ఈ వివక్షను ఉపేక్షించం. జాత్యాహంకారం నశించిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని అన్నారు. ఈ ఆదివారం జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్, అతని సహచరుడు బొటాస్‌ నలుపు కార్లతో  ట్రాక్‌పై దూసుకెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు