‘ప్రపంచ గొప్ప ఆల్‌రౌండర్‌ అతడే’

1 Jun, 2019 13:42 IST|Sakshi

ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌

లండన్‌ : ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రపంచకప్‌ తెరలేవగా.. పాకిస్తాన్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో మ్యాచ్‌ జరిగింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్‌ కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫాఫ్‌ డూప్లెసిస్‌, మార్కరమ్‌ అద్భుత క్యాచ్‌లు అందుకోగా.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అయితే ఒంటి చేత్తో బౌండరీ లైన్‌ వద్ద బంతిని అందుకొని ఔరా అనిపించాడు. ఈ క్యాచ్‌ ప్రపంచకప్‌ టోర్నీలోనే వన్‌ ఆఫ్‌ది బెస్ట్‌గా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ మాత్రం భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజానే గొప్ప ఫీల్డర్‌ అంటున్నాడు. ‘ప్రస్తుత క్రికెట్‌లో జడేజాను మించిన ఆల్‌రౌండర్‌, ఫీల్డర్‌ లేడు. అతను ఔట్‌ ఫీల్డ్‌లో పరుగులను అడ్డుకోవడం కానీ, కష్టమైన క్యాచ్‌ అందుకోవడం.. గురిచూసి నేరుగా వికెట్లకు కొట్టడం కానీ అద్భుతం.’ అని ప్రపంచకప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్లార్క్‌ కొనియాడాడు. పరిస్థితులకు తగ్గట్లు జడేజా మైదానంలో కదులుతాడని చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా భారత బ్యాట్స్‌మెన్‌ అంతా చేతులెత్తేయగా.. జడేజా ఒక్కడే(54) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు జట్టులో ఉండటంతో జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక భారత తన ఆరంభ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఈ నెల 5న ఆడనుంది.

మరిన్ని వార్తలు