బ్యాట్‌ పట్టిన  బంగారు చేప

28 Mar, 2019 00:49 IST|Sakshi

ఢిల్లీ క్రికెటర్లతో ఫెల్ప్స్‌ సరదా ఆట

న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ స్విమ్మర్, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఒలింపియన్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌  సరదాగా క్రికెట్‌ బ్యాట్‌ పట్టాడు. వాణిజ్య ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ఉన్న అతను... ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆటగాళ్లతో బుధవారం కొంత సమయం గడిపాడు. మంగళవారం ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా అతను స్టేడియంలో కూర్చొని చూశాడు. క్రికెట్‌ ఆట ఆసక్తికరంగా అనిపించినా... ఆడటం మాత్రం తన వల్ల కాదని అతను నవ్వుతూ చెప్పాడు. ‘ఐపీఎల్‌ మ్యాచ్‌లో సిక్సర్లను ఆస్వాదిం చాను. ఆటలో కొన్ని నిబంధనలు ఆసక్తికరంగా అనిపించాయి. ప్రేక్షకుల ఉత్సాహం మాత్రం చాలా బాగుంది. బ్యాట్‌ను పట్టుకోవడం మొదలు మరికొన్ని చిట్కాలు ఇవాళ నేర్చుకున్నాను.

వచ్చేసారి భారత్‌కు వచ్చినప్పుడు మాత్రం క్రికెట్‌ గురించి బాగా తెలుసుకొని వస్తా’ అని ఫెల్ప్స్‌ వ్యాఖ్యానిం చాడు. కావాల్సినన్ని రోజులు తన ఇంట్లో ఉండి ఫెల్ప్స్‌ క్రికెట్‌ నేర్చుకోవచ్చని రిషభ్‌ పంత్‌ సరదాగా చెప్పగా... తాను నేర్చుకోగలనని నమ్మినందుకు అతను కృతజ్ఞతలు చెప్పాడు. ఫెల్ప్స్‌ లాంటి దిగ్గజంతో సమయం గడిపే అవకాశం రావడం పట్ల క్రిస్‌ మోరిస్, ఇషాంత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. 2004–2016 మధ్య నాలుగు ఒలింపిక్స్‌లలో కలిపి ఫెల్ప్స్‌ 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్నాడు.    

మరిన్ని వార్తలు