ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్‌ కోచ్‌

25 Jun, 2019 10:28 IST|Sakshi
మిక్కీ ఆర్థర్‌

లండన్‌ : భారత్‌తో ఓటమి అనంతరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘోర పరాజయం అనంతరం తమ జట్టుపై అన్ని వర్గాల నుంచి వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌తో తనపై నెలకొన్న ఒత్తిడి తట్టుకోలేకపోయానని తెలిపాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తేరుకున్న పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో బుధవారం ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆర్థర్‌ మీడియాతో ముచ్చటించాడు. ‘ పోయిన ఆదివారం నేను చచ్చిపోవాలనుకున్నాను. చూస్తుండగానే మ్యాచ్‌ను కోల్పోయాం. ఒక్క చెత్త ప్రదర్శన కారణంగా ఆ ఆలోచన కలిగింది.  ఒక్క మంచి ప్రదర్శన చేస్తే అన్నీ సర్దుకుంటాయని ఆలోచించా. ఇది ప్రపంచకప్‌ కాబట్టి.. మీడియా సమీక్షలు, అభిమానులు అంచనాలు అన్ని సాధారణమే. సరిగ్గా వారం తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడారు. ఈ విజయం మాపై ఒత్తిడి తగ్గించింది. ఈ గెలుపుతో కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా. ఇంకా మేం టైటిల్‌ రేసులో ఉన్నాం. మా తదుపరి మ్యాచుల్లో న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. వాటిలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా అన్ని జట్లలాగే మా జట్టు కూడా బలంగా ఉంది’ అని ఆర్థర్‌ చెప్పుకొచ్చాడు.

అయితే ఆర్థర్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓ ఫ్రొఫెషనల్‌ కోచ్‌గా ఉండి ఒక్క ఓటమికే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వచ్చాయా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటగాళ్లలో స్పూర్తిని నింపాల్సిన కోచ్‌ ఇలా డీలా పడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పాక్‌కు దక్షిణాఫ్రికా విజయం ఊరటనిచ్చింది. బుధవారం కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్‌ విజయం సాధిస్తే ఆ జట్టుకు సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
చదవండి : వైరల్‌: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’
నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా!

మరిన్ని వార్తలు