'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది'

4 Mar, 2020 16:19 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ జాన్సన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ‌లకు ఒకరంటే ఒకరు పడదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే 2014 పర్యటనలో ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. కవ్వింపులకు దిగిన జాన్సన్‌కు విరాట్ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. కివీస్‌ పర్యటనలో పూర్తిగా తేలిపోయిన కోహ్లీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కోహ్లి ఆటతీరు, మైదానంలో అతను ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. (కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు ?)

అయితే ఇదే అదునుగా భావించిన జాన్సన్ విరాట్‌ కోహ్లీని మరోసారి టార్గెట్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో మ్యాచ్ ముగుస్తుందనగా.. భారత్‌కు వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని కోహ్లీ సహచర ఆటగాళ్లతో అంటూ ప్రత్యర్థులను హెచ్చరించాడు. అయితే కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు తనకు నవ్వును తెప్పించాయని జాన్సన్ కామెంట్ చేశాడు. కోహ్లీ చేసిన( 'భారత్‌కు వచ్చినప్పుడు ‌నేనేంటో చూపిస్తా')వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ఈ మాటలు వింటే నవ్వొస్తొందని క్యాప్షన్‌‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన  పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే జాన్సన్‌ తీరుపై కోహ్లీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఒక ఆటగాడిని ఇలా వెకిలి చేయడం ఏం బాలేదు..భారత్‌కు వచ్చినప్పుడు కోహ్లీ తానేంటో నీకు చూపిస్తాడులే అంటూ కామెంట్ చేస్తున్నారు.
(మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు)

మరిన్ని వార్తలు