హ్యాట్రిక్‌ వికెట్లతో ఇరగదీశాడు..!

25 Oct, 2019 14:05 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక పేసర్‌ అభిమన్యు మిథున్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో ఇరగదీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో మిథున్‌ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ ఐదు వికెట్లలో హ్యాట్రిక్‌ సాధించడంతో అరుదైన ఘనతను నమోదు చేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో హ్యాటిక్ర్‌ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మిథున్‌ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్‌ మూడో బంతికి షారుఖ్‌(27) వికెట్‌ సాధించిన మిథున్‌.. ఆపై వరుస రెండు బంతుల్లో ఎమ్‌ మహ్మద్‌((10), మురుగన్‌ అశ్విన్‌(0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఫలితంగా హ్యాట్రిక్‌ వికెట్‌ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 

టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్‌ ముకుంద్‌- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు అయితే మురళీ విజయ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరితే ముకుంద్‌(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్‌(66), విజయ్‌ శంకర్‌(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కర్ణాటక బౌలర్లలు మిథున్‌ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్‌ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్‌ జైన్‌, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్‌ లభించింది.

మరిన్ని వార్తలు