రెడ్ బుల్ కార్ట్ ఫైట్
సాక్షి, హైదరాబాద్: రెడ్ బుల్ కార్ట్ ఫైట్ నేషనల్ ఫైనల్స్లో కొచ్చి రేసర్ మొహమ్మద్ రిదాఫ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. లియోనియా రిసార్ట్లో జరిగిన రెడ్బుల్ కార్ట్ ఫైట్ నేషనల్ ఫైనల్స్ రేసులో విజేతగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అతను 12 ల్యాప్ల రేసుని 9 నిమిషాల 14.336 సెకన్లలో చేరుకొని చాంపియన్గా నిలిచాడు. ఢిల్లీ రేసర్ రచిత్ సింఘాల్ (9ని. 15.490సె.) రెండో స్థానాన్ని, ప్రేమిల్ సింగ్ (బెంగళూరు; 9ని. 16.887సె.) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 8 మంది రేసర్లు ఫైనల్లో పాల్గొన్నారు.
జూలై 12 నుంచి అక్టోబర్ 6 వరకు బెంగళూరు, చెన్నై, బరోడా నగరాల్లో జరిగిన సిటీ క్వాలిఫయర్స్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన 23 మంది నేషనల్ ఫైనల్స్ టోరీ్నకి అర్హత సాధించారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహించగా మెరుగైన 8 మంది క్రీడాకారులు ఫైనల్కు చేరుకున్నారు. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత తొలి ఫార్ములా –4 మహిళా రేసర్ మీరా ఎర్డా పాల్గొని సందడి చేసింది.