అది మా అమ్మ కోరిక: పాక్‌ బౌలర్‌

16 Jun, 2019 12:30 IST|Sakshi

మాంచెస్టర్‌ : భారత్‌పై ఐదు వికెట్లు పడగొట్టడం తన తల్లి కోరికని పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ తెలిపాడు. భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో ఈ పాక్‌ పేసర్‌ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయగానే తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయన్నాడు. ‘నేను బాగా ఆడాలని స్వర్గం నుంచి నా తల్లి తప్పకుండా  ప్రార్థిస్తుంది. మ్యాచ్‌ జరిగేటప్పుడు ప్రతిసారీ ఆమె టీవీ ముందు కూర్చొని నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇక నేను ఐదు వికెట్లు తీయడమే మా అమ్మ కోరిక. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఎప్పుడూ ధీటుగా నిలబడాలని సూచించేంది. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన వెంటనే కన్నీళ్లొచ్చాయి. ఆ సమయంలో మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి’ అని ఆమిర్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

ఆమిర్‌ తల్లి నసీం అక్తర్‌ ఈ ఏడాది మార్చిలో చనిపోయారు. ఆమె చెప్పినట్లు భారత్‌పై ఆమిర్‌ చెలరేగడం అంత సులువేమి కాదు. ఇక ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆమిర్‌ చెప్పుకొచ్చాడు. ‘సరైన సమయంలో 5 వికెట్లు పడగొట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శన అనంతరం నేను ఉప్పొంగిపోయాను. అయితే నేను బౌలింగ్‌ బాగా చేసినా చేయకపోయినా మా జట్టు నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది’ అని తెలిపాడు. చివరి నిమిషంలో పాక్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఆమిర్‌.. ఆస్ట్రేలియా మ్యాచ్‌ ద్వారా సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక చాంపియన్స్‌ ట్రోఫీ ఫైన్‌ల్లో ఆమిర్‌ భారత్‌ టాపర్డర్‌ను కూల్చి కోహ్లిసేన పతనాన్ని శాసించాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఒకే మ్యాచ్‌ గెలిచి 8వ స్థానంలో ఉ‍న్న పాక్‌కు మరో మ్యాచ్‌ ఓటమి సెమీస్‌ అవకాశాలపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో భారత్‌పై గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో పాటు ఆత్మవిశ్వాసం లభిస్తోందని ఆ జట్టు భావిస్తోంది.

మరిన్ని వార్తలు