నా ముందు.. నా తర్వాత ఎందరో ఫిక్సర్లు 

5 May, 2020 04:49 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ ఆసిఫ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ మొహమ్మద్‌ ఆసిఫ్‌ తమ క్రికెట్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పు చేసిన వారందరికీ రెండో అవకాశమిచ్చే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తన విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిం చిందని అన్నాడు. తన కన్నా ముందు ఎందరో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, తన తర్వాత కూడా మరెందరో ఈ మార్గంలో నడిచారని అన్నాడు. అయితే పీసీబీ మాత్రం తనకే కఠిన శిక్ష విధించిందని చెప్పాడు. 2010లో ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆసిఫ్‌పై పీసీబీ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ‘అందరూ తప్పులు చేస్తారు. కానీ పీసీబీ నాపై వివక్ష చూపింది. నేను ఏ స్థాయి బౌలర్‌ని అని చూడకుండా శిక్షించింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఒకప్పడు నా బౌలింగ్‌తో ప్రపంచాన్ని వణికించా. ఇన్నేళ్లు గడిచాక కూడా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ నా బౌలింగ్‌ గురించి మాట్లాడటం గర్వంగా ఉంటుంది. పీటర్సన్, డివిలియర్స్, ఆమ్లా నా గురించి గొప్పగా చెప్పడం ఆనందాన్ని కలిగించింది’ అని 37 ఏళ్ల ఆసిఫ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు