క్రికెటర్‌ నబీ సంచలన నిర్ణయం

6 Sep, 2019 12:46 IST|Sakshi

చోట్టాగ్రామ్‌: అఫ్గానిస్తాన్‌ ఆల్‌ రౌండర్‌ మహ్మద్‌ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకడానికి సిద్ధమయ్యాడు. తన కెరీర్‌లో కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నబీ.. ఎర్రబంతి క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ తర్వాత నబీ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ తర్వాత ఇక టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బోర్డుకు తెలిపాడు.

ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్‌ టీమ్‌ మేనేజర్‌ నజీమ్‌ జర్‌ అబ్దుర్రాహీమ్‌ జయ్‌ స్పష్టం చేశారు.  ‘ అవును..  బంగ్లాదేశ్‌తో టెస్టు తర్వాత నబీ రిటైర్‌ అవుతున్నాడు. నబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టెస్టు ఫార్మాట్‌ నుంచి నబీ తప్పుకోవడానికి గల కారణాలను మేము అర్థం చేసుకోగలం’ అని నజీమ్‌ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ అఫ్గానిస్తాన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్‌ షా సెంచరీ చేయగా, అస్గర్‌ అఫ్గాన్‌(92) తృటిలో శతకం కోల్పోయాడు.

మరిన్ని వార్తలు