ధోనిని పక్కనపెడితే తీవ్ర నష్టం..

22 May, 2020 14:40 IST|Sakshi

ధోనిని ఉన్నఫలంగా తీసేస్తే టీమిండియాకు నష్టం

ధోనికి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు ఎవరూ లేరు

ఇప్పటికీ అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ ధోనినే: కైఫ్‌

హైదరాబాద్‌: మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనిపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికీ భారత్‌లో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అతడేనని స్పష్టం చేశాడు. ఎక్కువగా ఒత్తిడి ఉండే 6,7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విషయాన్ని గుర్తుచేవాడు. ముఖ్యంగా టెయిలెండర్లతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే పద్దతి ఎవరూ మర్చిపోలేరన్నాడు. ఉన్నఫలంగా ధోనిని పక్కకుపెడితే టీమిండియాకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎందుకంటే అతడిని పక్కకు పెడితే ఇప్పటికిప్పుడు ఆ స్థాయి వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ టీమిండియాకు దొరకడని అభిప్రాయపడ్డాడు. 

‘ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే తిరిగి టీమిండియాలోకి ధోని వస్తాడని అందరూ భావిస్తూన్నారు. కానీ ఆవ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఎందుకంటే ధోని అత్యుత్తమ ఆటగాడు. ఎలాంటి ఒత్తిడిలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. ప్రపంచకప్‌ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఈ ఓటమి తర్వాతే ధోని రిటైర్మెంట్‌ అంశం తెరపైకి వచ్చింది. అయితే ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఉన్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి. 

కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లు ధోనికి ప్రత్యామ్నాయమని అందరూ అంటున్నారు. రాహుల్‌ మంచి బ్యాట్స్‌మన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కీపింగ్‌ విషయంలో అతడిపై ఎక్కువగా ఆధారపడొద్దు. స్పెషలిస్టు కీపర్‌కు గాయమైతే ఒకటి రెండు మ్యాచ్‌లు నెట్టుకరావచ్చు. కానీ అతడికే పూర్తిస్థాయిలో కీపింగ్‌ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. ఇక పంత్‌, శాంసన్‌లు ఇంకా పరిణితి చెందాలి. సచిన్‌, ద్రవిడ్‌ వంటి దిగ్గజాల స్థానాలను కోహ్లి, రోహిత్‌, రహానే, పుజారాలు దాదాపుగా భర్తీ చేశారు. కానీ ధోనికి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు ఎవరూ నాకైతే కనిపించలేదు. ధోని ఇంకొంత కాలం క్రికెట్‌ ఆడితే టీమిండియాకు ఎంతో లాభం’అంటూ కైఫ్‌ పేర్కొన్నాడు.  

చదవండి:
చోటివ్వలేదని తిడుతున్నారు.. సారీ
మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లు వీరే!

మరిన్ని వార్తలు