న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ షమీపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ప్రశంసలు కురిపించాడు. భారత మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో షమీ ఒకడని భోగ్లే కొనియాడాడు. దీనిలో భాగంగా కివీస్తో మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన షమీ వరల్డ్కప్ బెర్తును ఖాయం చేసుకున్నాడన్నాడు. ‘ దాదాపు ఏడాదిన్నర కాలంగా భారత్ పలువురు పేసర్లు పరీక్షిస్తూ వస్తుంది. ప్రధానంగా వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయోగాలు చేసింది. భువనేశ్వర్, బూమ్రాలకు జతగా సరైన పేసర్ కోసం అన్వేషిస్తుంది. ఈ తరుణంలో షమీ ఫామ్లోకి రావడం శుభ పరిణామం. వరల్డ్కప్కు ఇంగ్లండ్కు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు ఖాయం. కాకపోతే అతనిపై ఎక్కువ వర్క్లోడ్ పడకుండా జాగ్రత్త పడటం మంచింది. ఈ విషయంలో మాత్రం టీమిండియా యాజమాన్యం తగిన వ్యూహంతో ముందుకెళ్లాలి’ అని హర్షా భోగ్లే తెలిపాడు.
న్యూజిలాండ్తో తొలి వన్డేలో షమీ మూడు వికెట్లు సాధించి ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బ తీశాడు. మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రోలను బౌల్డ్ చేసిన షమీ.. మిచెల్ సాంత్నార్ను ఎల్బీగా పెవిలియన్కు పంపాడు. దాంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 157 పరుగులకే కివీస్ ఆలౌట్ కాగా, ఆపై భారత్ 34.5 ఓవర్లలో(డక్వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది.