డెహ్రాడూన్: భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి కారులో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అతని తలకు గాయాలయ్యాయి. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ‘తలకు దెబ్బ తగలడంతో కుట్లు పడ్డాయి. గాయం చిన్నదే. కంగారు పడాల్సిన పనిలేదు. ఓ రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది’ అని వైద్యులు తెలిపారు. భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో గత రెండు వారాలుగా వార్తల్లో నిలిచిన షమీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్–11లో షమీ ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున బరిలో దిగనున్నాడు.