షమీ ట్రాక్‌లోకి వచ్చేశాడు..

3 Jul, 2020 12:16 IST|Sakshi

లక్నో: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ సుదీర్ఘ విరామం తర్వాత ట్రాక్‌లోకి వచ్చేశాడు. కరోనా కారణంగా దాదాపు నాలుగునెలలు పాటు ఇంటికే పరిమితమైన షమీ.. అవుట్‌ ఫీల్డ్‌లో ప్రాక్టీస్‌ ఆరంభించాడు. పేస్‌, సీమ్‌, రిథమ్‌లు కలగలిపిన షమీ తన బౌలింగ్‌కు పదునుపెట్టే పనిలో పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉన్న ఫామ్‌ హౌజ్‌లో షమీ ప్రాక్టీస్‌ చేశాడు. తన సోదరులతో కలిసి బౌలింగ్‌లో వాడి వేడిని పరీక్షించుకున్నాడు. దీనికి సంబంధించిన చిన్నపాటి వీడియో క్లిప్‌ను షమీ తన ట్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ‘ నా ఫామ్‌ హౌజ్‌లో క్వాలిటీ ప్రాక్టీస్‌ సెషన్‌. నా బ్రదర్స్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేశాను’ అని షమీ పేర్కొన్నాడు.(రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?)

గతంలో ఇంట్లో షమీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు బౌలింగ్‌ చేస్తుండగా షమీ బ్యాటింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌లో కూడా అప్పుడప్పుడూ ఫర్వాలేదనిపించే షమీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడంతో ఇంటినే ప్రాక్టీస్‌కు వాడుకున్నాడు. ఇప్పుడు బౌలింగ్‌ ప్రాక్టీస్‌కు ఫామ్‌ హౌజ్‌కు వెళ్లి మరీ తన బౌలింగ్‌ పదును ఎలా ఉందో పరీక్షించుకున్నాడు.  టీమిండియా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌లో షమీ ఒకడు. జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మలతో కలిసి సీమ్‌ బౌలింగ్‌ విభాగాన్ని పంచుకుంటున్నాడు షమీ. గతంలో తమ బౌలింగ్‌ ఆయుధాల్లో ఒకడని విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆరంభ ఓవర్లతో పాటు మధ్య ఓవర్లలో కూడా బంతిని స్వింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయడంలో షమీ సిద్ధహస్తుడు. ఒకానొక సందర్భంలో జట్టులో చోటుపై డైలమాలో పడ్డ షమీ.. ఇప్పుడు టీమిండియాలో రెగ్యులర్‌ సభ్యుడు. త‍్వరలో క్రికెట్‌ టోర్నీలు పట్టాలెక్కే అవకాశం ఉన్నందును క్రికెటర్లు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి ప్రాక్టీస్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారు. (‘ఈ ఏడాది ఐపీఎల్‌లో నాకు చాన్స్‌ ఉంది’)

>
మరిన్ని వార్తలు