ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ

11 Mar, 2018 09:19 IST|Sakshi
మహ్మద్‌ షమీ

బీసీసీఐ విషయంలో ఎలాంటి టెన్షన్‌ లేదు

సాక్షి, స్పోర్ట్స్‌ : తన భార్య చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ డిమాండ్‌ చేశాడు. ఆదివారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చెపట్టాలని మాత్రమే కోరుతున్నాను. బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాకు ఎలాంటి టెన్షన్‌ లేదు.’ అని షమీ తెలిపాడు. ఇక భార్య హసిన్‌ జహాన్‌ ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో షమీ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.

షమీ వివాహేతర సంబంధాలను హసిన్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం రోజు రోజుకో ఓ మలుపు తిరుగుతోంది. చివరకు శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ,అత్యాచార యత్నం, వేధింపులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఈ క్రికెటర్‌పై కేసులు నమోదయ్యాయి.  అయితే హసిన్‌ రోజుకో కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తున్నారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన అనంతరం మీడియాకు దూరంగా ఉన్న షమీ తాజాగా ఎఎన్‌ఐతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు