‘పాక్‌ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది’

4 Jul, 2019 22:47 IST|Sakshi

కరాచీ : న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించడంతో పాకిస్తాన్‌కు దాదాపు సెమీస్‌ దారులు మూసుకపోయాయి. ప్రపంచకప్‌ లీగ్‌లో భాగంగా చివరి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో పాక్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 316 పరుగుల తేడాతో గెలిస్తేగానీ నాకౌట్‌కు వెళ్లే అవకాశం లేదు. దీంతో ప్రపంచకప్‌ నుంచి పాక్‌ నిష్క్రమించడం ఖాయమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీమిండియాపై ఓడిపోయాక పాక్‌ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్న ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు తాజాగా సెమీస్‌ ఆశలు గల్లంతవ్వడంతో మరింత విరుచకుపడుతున్నారు. అయితే మాజీ సారథి మొయిన్‌ ఖాన్‌ మాత్రం పాక్‌ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నాడు. 

‘1992 ప్రపంచకప్‌ ఫలితాన్ని రిపీట్‌ చేస్తుందని అందరం భావించాం. కానీ సెమీస్‌కు వెళ్లకుండానే వెనుదిరగడం నిరాశ కలిగించేదే. అయితే ఈ ప్రపంచకప్‌లో సర్ఫరాజ్‌ బృందం శక్తి మేర పోరాడింది. స్పూర్తిదాయకమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో మరీ అంత చెత్త ప్రదర్శన చేయలేదు. వారిని నిదించాల్సిన అవసరంలేదు. ఆటగాళ్లను మార్చాలని అందరూ అంటున్నారు. కానీ ఆటగాళ్లను, బాధ్యతలను మార్చినంత మాత్రాన ప్రదర్శన మారదు. టీమిండియాపై ఆస్ట్రేలియా ఓడిపోయినా.. తిరిగి పుంజుకొని పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. కానీ పాక్‌ మాత్రం అలా చేయలేకపోయంది. ఆటగాళ్లకు, కోచింగ్‌ బృందానికి ఆటపై మక్కువ, గెలుపు కోసం ఎందాకైనా పోరాడే తెగింపు ఉండాలి’అంటూ మొయిన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

ఇక ప్రపంచకప్‌లో తమ జట్టు చెత్త ప్రదర్శనపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గత మూడేళ్లుగా పాక్‌ ప్రదర్శనపై నివేదిక సమర్పించాలని.. అంతేకాకుండా భవిష్యత్‌ ప్రణాళికలపై కూడా సలహాలు ఇవ్వాలని కమిటీని కోరింది. ఇక సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్‌ను తప్పించాలని పెద్ద మొత్తంలో వాదనలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు