రేసులో గిల్క్రిస్ట్, అక్రమ్, రిచర్డ్స్
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరనే దానిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కెప్టెన్ ఎం.ఎస్.ధోనిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరితో పాటు గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా), వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)లు కూడా దీని కోసం పోటీపడుతున్నారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు చెందిన ‘క్రికెట్ మంత్లీ’ అనే మ్యాగజైన్ ఈ సర్వేను చేపట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా 50 మంది దిగ్గజ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, క్రికెట్ కాలమిస్ట్లతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురిలో ఒక్కర్ని ఎంపిక చేయనుంది. మరో రెండు వారాల్లో విజేతను ప్రకటించనున్నారు. సమకాలీన క్రికెటర్లలో సచిన్ అంతకాలం ఆట ఆడిన మరో ఆటగాడు లేడు. ఈ విషయంలో మాస్టర్కు ఎవరూ సాటిరారు. దాంతోపాటు క్రికెట్లో ఉన్న దాదాపు అన్ని రికార్డులను అతను తిరగరాశాడు. మరోవైపు వన్డేల్లో అత్యుత్తమ ఫినిషిర్గా పేరు తెచ్చుకున్న ధోని.. భారత్ జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 2011 ప్ర పంచకప్ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇక తన 12 ఏళ్ల కెరీర్లో ఆసీస్కు లెక్కలేనన్నీ విజయాలు అందించిన గిల్క్రిస్ట్ మంచి స్ట్రోక్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు.