ధోని పేరు దుర్వినియోగం!

29 Jan, 2017 16:13 IST|Sakshi
ధోని పేరు దుర్వినియోగం!

ఢిల్లీ:గతంలో ఓ మొబైల్ కంపెనీతో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చేసుకున్న ఒప్పందం ముగిసినప్పటికీ సదరు కంపెనీ అతిక్రమణకు పాల్పడటంతో ఆ కేసు మరోసారి కోర్టుకు చేరింది. తనతో మ్యాక్స్ మొబిలింక్ ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్న బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందం నాలుగేళ్ల క్రితమే ముగిసినా, ఇంకా ఆ కంపెనీ తన పేరును వాడుకోవడంపై ధోని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి గతేడాది ఏప్రిల్ 21వ తేదీన కోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేసినా, వాటిని కంపెనీ ఉల్లఘించింది. ఈ మేరకు ధోని దాఖలు చేసిన పిటిషన్ తో మరోసారి విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. తన ఆదేశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఆ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కచ్చితంగా కోర్టు మార్గదర్శకాల్ని అమలు చేయాల్సిన కంపెనీ అతిక్రమణకు పాల్పడాటాన్ని తప్పుబట్టింది. ఇంకా అతని పేరును కమర్షియల్గా వాడుకోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. దీనిలో భాగంగా కోర్టు ధిక్కారణకు పాల్పడిన ఆ కంపెనీ ఉన్నతాధికారుల్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.


గత కొన్నేళ్ల క్రితం మ్యాక్స్ మొబిలింక్ కంపెనీతో  ధోని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం 2012 డిసెంబర్ నెల నాటికి ముగిసింది. అయినప్పటికీ  ధోని పేరున తమ వెబ్సైట్ల నుంచి ఆ కంపెనీ తొలగించలేదు. దాంతోపాటు ధోని పేరును దుర్వినియోగం చేస్తూ తమ మార్కెటింగ్ ను కొనసాగిస్తోంది. దీనిపై గతంలో ఢిల్లీ హైకోర్టును ధోని ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే ధోని పేరును వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ ధోని పేరుతోనే ఆ కంపెనీ మార్కెటింగ్ నిర్వహించడంతో ఆ కేసు మరోసారి కోర్టుకు చేరింది.
 

మరిన్ని వార్తలు