ధోని తిరుగు ప్రయాణం..

17 Aug, 2019 12:39 IST|Sakshi

లెహ్‌: పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు వెళ్లిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. దాన్ని విజయవంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ మేరకు న్యూఢిల్లీకి బయల్దేరే క్రమంలో లెహ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ధోని దర్శనిమిచ్చాడు.  భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోని పనిచేశాడు. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. ఆగస్టు15 వ తేదీతో ధోని కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందు తిరుగు ప్రయాణం అయ్యాడు.

కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్‌ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు.  ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు.

>
మరిన్ని వార్తలు