జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

21 Sep, 2017 09:33 IST|Sakshi
జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీసేన విజయానికి ముఖ్య కారకుడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే. జట్టుకు కెప్టెన్ కోహ్లి అయినా, ఈ విజయాలకు సారథి మాత్రం ధోనినే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లుతున్నాయి. ధోని తొలుత బ్యాటింగ్‌లో కీలక వికెట్లు కోల్పోయిన జట్టును హార్ధిక్ పాండ్యాతో పాటు ఆదుకున్నాడు. ఆపై ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో టీమిండియా బౌలర్లకు ధోని చేసిన కీలక సూచనలే మ్యాచ్ గతిని మార్చివేశాయని తెలుస్తోంది. ఇందుకు స్టంప్ మైక్‌ల్ రికార్డయిన ధోని మాటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ఆడియో సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

'మిస్టర్ కూల్' ధోని కీలక సూచనలు పాటించిన ఇద్దరు  బౌలర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు వైవిధ్యమైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఒక్కొక్కరిగా పెవిలియన్‌కు పంపారు. కానీ వికెట్ల వెనుక ఉన్న మహేంద్రుడు వారికి మార్గనిర్దేశం చేశాడు. తొలుత ప్రమాదకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌, స్టొయినిస్‌ను కుల్దీప్ పెవిలియన్‌కు పంపించాడు. ఆపై భారీ సిక్సర్లతో చెలరేగిన మ్యాక్స్‌వెల్‌, పాట్ కమిన్స్‌, మాథ్యూ వేడ్‌ లను మరో స్పిన్నర్ చహల్‌ పెవిలియన్ బాట పట్టించాడు.

స్టంప్ మైక్‌లో ధోని మాటలు
'వో మార్నే వాలా దాల్నా.. అందర్‌ యా బాహర్‌ కోయీ భీ (షాట్‌ ఆడేలా బాల్ వేయి అయితే వికెట్ల వైపు లేదా బయటకి వచ్చినా ఒకే), గూమ్నే వాలా దాల్‌.. ఘూమ్నే వాలా దాల్‌.. (బాగా టర్న్‌ అయ్యేలా బౌలింగ్ చెయ్)' అంటూ యువ బౌలర్ కుల్దీప్‌నకు ధోనీ సూచించాడు. మాక్స్‌వెల్ ఆటకట్టించేందుకు స్టంప్స్‌ పైకి బాల్స్ వేయొద్దన్నాడు. తాను చెప్పిన బంతులు వేయని సందర్భంలో మహీ.. 'ఐసే ఐసే దాలో, తు భీ సున్తా నహీ హై క్యా (నువ్వు కూడా నా మాట వినిపించుకుంటలేవు)' అంటూ చహల్‌కు చెప్పడం రికార్డైంది. ఇలా ధోని చేసిన సూచనల్ని పాటింటిన స్పిన్నర్లు ఆసీస్‌ దూకుడుకు కళ్లెంవేశారు. తద్వారా ధోని ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు.

మరిన్ని వార్తలు