ధోనికి కోపమొచ్చింది

16 Jan, 2019 16:47 IST|Sakshi

అడిలైడ్‌: టీమిండియా మిస్టర్‌ కూల్‌కు కోపమొచ్చింది. అవును టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని.. యువ ఆటగాడు ఖలీల్‌ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శతకంతో పాటు ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ తోడవడంతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఇన్నింగ్స్‌ సందర్భంగా మ్యాచ్‌ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయంలో అంపైర్లు డ్రింక్స్‌ బ్రేక్‌ ఇచ్చారు. 

ఈ సమయంలో టీమిండియా 12వ ఆటగాడు ఖలీల్‌ అహ్మద్‌, 13వ ఆటగాడు యజువేంద్ర చహల్‌లు ధోని, దినేశ్‌ కార్తీక్‌లకు డ్రింక్స్‌ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. అయితే ఖలీల్‌ పిచ్‌పై పరుగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఎక్కడ నడుస్తున్నావ్‌? పిచ్‌ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ ఖలీల్‌పై ధోని గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక దీనిపై  ‘ఖలీల్‌ జాగ్రత్త.. మిస్టర్‌ కూల్‌కు కోపం తెప్పించకు’.. ‘ఏమైంది ఈ యువ ఆటగాళ్లకు.. మొన్న కుల్దీప్, నిన్న ఖలీల్‌.. ధోనికి కోపం తెప్పించినందుకు తప్పదు భారీ మూల్యం’అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.      

మరిన్ని వార్తలు