అందులో ఎలాంటి దేవ రహస్యం లేదు: ధోని

23 Nov, 2018 10:41 IST|Sakshi

హైదరాబాద్‌: సొంతగడ్డపై 2011 ప్రపంచకప్‌ గెలిచిన మధుర క్షణాలను అప్పటి సారథి ఎంఎస్‌ ధోని నెమరు వేసుకుంటున్నాడు. అంతేకాకుండా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ముందు రావడంపై ధోని క్లారిటీ ఇచ్చాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ‘2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో యువరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చే స్థానంలో నేను వచ్చా. అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే శ్రీలంక బౌలర్లలో చాలా మంది చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన వారే మురళీధరన్‌తో సహా. దీంతో వారి బౌలింగ్‌లో చాలా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాళ్లము. ఆ అనుభవంతో వారిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనే ఆలోచన వచ్చి మేనేజ్‌మెంట్‌కు చెప్పా.. వాళ్లు ఓకే అన్నారు. అంతే తప్పా ఇందులో ఎలాంటి దేవ రహస్యం లేదు’అంటూ ధోని ఆనాటి విషయాలను వివరించారు. (35 అడుగుల ధోని కటౌట్‌..)

ఇక ఆ మ్యాచ్‌లో ధోని(91 నాటౌట్‌), గౌతమ్‌ గంభీర్‌(97)ల వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ప్రపంచకప్‌ అందించిన విషయం తెలిసిందే. ఆప్పటి హీరోలు ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం పరితపిస్తున్నారు. సీనియర్‌ ఆటగాళ్లు గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌లు ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కించుకోవడమనేది ఇక కలే. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ వేదికగా జరగబోయే ప్రపంచకప్‌లో ధోని ఉంటాడో లేడో కూడా తెలియని గందరగోళ పరిస్థితి. ఇప్పటికే టీ20 నుంచి సెలక్టర్లు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ను తప్పించిన విషయం తెలిసిందే. అనుభవం, కీపింగ్‌, మైదానంలో విరాట్‌ కోహ్లికి సూచనల కోసమైన మిస్టర్‌ కూల్‌ను జట్టులోకి తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (‘ధోని 20 ఏళ్ల యువ క్రికెటరేం కాదు’)

మరిన్ని వార్తలు