‘ఆ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు రావాలి’

24 May, 2019 11:20 IST|Sakshi

న్యూఢిల్లీ: మరొకొద్ది రోజుల్లో వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న తరుణంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. టీమిండియా జట్టులో గత కొన్నేళ్లుగా నాలుగో స్థానంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానున్నా.. ఈ స్థానంలో ఎవరు ఆడుతారో మాత్రం తెలియట్లేదు.

అయితే నాలుగో స్థానంపై స్పందించని సచిన్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ధోనిని ముందుకు పంపాలని తన అభిప్రాయం తెలిపారు. తాజాగా సచిన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా. జట్టు కూర్పు ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు.. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి వస్తాడు. నాలుగో స్థానంలో ఎవరువచ్చినా.. ఐదో స్థానంలో ధోని రావాలి' అని సచిన్ పేర్కొన్నారు.  ఇక మిడిల్‌ ఆర్డర్‌కు హార్దిక్‌ పాండ్యా అండగా ఉంటాడని, అప్పుడు అనుభవం ఉన్న ధోని.. పాండ్యాతో కలిసి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లగలడు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు