ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు

5 May, 2017 18:11 IST|Sakshi
ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు

ఐపీఎల్‌-2017 సీజన్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రమేయం లేకుండానే అతన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కెప్టెన్సీ నుంచి ధోనీని జట్టు యాజమాన్యం తొలగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ధోనీని కించపరిచేలా పుణె టీమ్‌ యజమాని సోదరుడు ట్వీట్ చేయడం మరింత వివాదం రాజేసింది. ఈ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా ధోనీ ఆటతీరుపైనా విమర్శలు వచ్చాయి. అయితే ధోనీ ఎక్కడా వీటిపై పెదవి విప్పలేదు. అభిమానులు, మాజీలు అతనికి అండగా నిలిచారు. ఈ వివాదాలను పక్కనబెడితే మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మిస్టర్‌ కూల్‌గా ఉండే ధోనీ.. నిజజీవితంలోనూ సింపుల్‌గా ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో్ వైరల్‌ అవుతున్న ఓ వీడియోను ఇందుకు నిదర్శనం.

ధోనీ ఎయిర్‌పోర్ట్‌లో పుణె టీమ్మేట్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ కొడుకు గిబ్రాన్‌తో కలసి ఫ్లోర్‌పై కూర్చున్నాడు. ఓ బొమ్మ కారుతో చిన్నారి గిబ్రాన్‌తో ఆడుకుంటూ ఈ వీడియోలో మహీ కనిపిస్తాడు. కాగా ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు. ఐపీఎల్‌లో పుణె తర్వాతి మ్యాచ్‌ హైదరాబాద్‌తో ఆడాల్సివుంది. పుణె జట్టు హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ధోనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ధోనీ గతంలో కూడా పలుమార్లు ఓ సామాన్యుడిలా ప్రవర్తించిన సంఘటనలున్నాయి.
 

మరిన్ని వార్తలు