మెంటార్‌గా ఎంఎస్‌ ధోని..!

18 Sep, 2018 13:27 IST|Sakshi

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల్ని తప్పుకున్న తర్వాత కూడా జట్టును గైడ్‌ చేస్తూ విజయాల్లో ఎంఎస్‌ ధోని ముఖ్యభూమిక పోషిస్తూనే ఉన్నాడు. జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దగ్గర్నుంచి, ఆటగాళ్ల వరకూ ధోని సలహాల్ని తీసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. ఇదిలా ఉంచితే, ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌తో తొలి మ్యాచ్‌ ఆడబోతున్న క్రమంలో ధోని మెంటార్‌ అవతారమెత్తాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది ఇంకా యూఏఈకు చేరుకోకపోవడంతో జట్టును దగ్గరుండి చూసుకునే బాధ్యత ధోనిపై పడింది.

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉన‍్నప్పటికీ, యువ క్రికెటర్లను సానబట్టే పనిలో పడ్డాడు ధోని. ప్రధానంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో అవీష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, సిద్దార్థ్‌ కౌల్‌, నదీమ్‌, మయాంక్‌ మార్కేండ్‌లు.. భారత బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేస్తూ కనిపించాడు ధోని. ఒకవైపు తన బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే బౌలర్లకు కొన్ని టిప్స్‌ చెప్పడం ఆకట్టుకుంది. సమస్యను సవాల్‌గా స్వీకరించే ధోని.. ఒక సీనియర్‌ క్రికెటర్‌గా తన బాధ్యతను గుర్తించి ఇలా మెంటార్‌ పాత్రలో కనిపించడం మరొకసారి అతని ప్రత్యేకతను చాటింది. 

మరిన్ని వార్తలు