ఆర్పీసింగ్‌, చావ్లాలతో ధోని..

6 Feb, 2020 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని తనకు దొరికిన విశ్రాంతి సమయాన్ని బాగానే ఎంజాయ్ చేసున్నాడు. ఈ మధ్యనే మాల్దీవులకు వెళ్లిన ధోని.. అక్కడ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్‌పి సింగ్‌, పీయూష్‌ చావ్లాలు కూడా ఓ కార్యక్రమంలో ధోనిని కలిశారు. ఈ క్రమంలోనే ఓ పానీపూరి స్టాల్ దగ్గర నిలబడిన ధోని.. అక్కడున్న పదార్థాలను తీసుకుని పానీపూరిని తయారు చేసాడు. వాటిని స‌హ‌చ‌ర క్రికెటర్లు ఆర్పీ సింగ్‌, పీయూష్ చావ్లాలకు అందించాడు. వెంటనే ఆర్పీ సింగ్‌ ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎంఎస్‌ ధోని పూరి తయారు చేసిన విధానాన్ని ‘ఎంఎస్ ధోని ఫాన్స్’ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ‘మాల్దీవుల్లో మా రాక్‌స్టార్ పానీ పూరిస్‌ తయారుచేస్తున్నాడు’ అని కాప్షన్ రాసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌లైంది. అభిమానులు ఫన్నీ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. 

గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ధోని.. మళ్లీ భారత జట్టు తరఫున ఆడలేదు. గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని.. ఐపీఎల్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాతే భారత్‌ తరఫున ధోని మళ్లీ ఆడతాడా.. లేదా అనే విషయం తెలుస్తుంది. ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ.. అందులో ధోనికి స్థానం కల్పించలేదు. గత అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించడంతోనే ధోనికి చోటు దక్కలేదని బీసీసీఐ పెద్దలు వివరణ ఇచ్చారు. అక్టోబర్‌ నెల నుంచి చూస్తే ధోని ఆడలేదని, దాంతోనే అతని కాంట్రాక్ట్‌ను తొలగించామన్నారు. ఒకవేళ మళ్లీ ధోని రీ ఎంట్రీ ఇస్తే కాంట్రాక్ట్‌ రావడం అంత కష్టం ఏమీ కాకపోవచ్చు. 

మరిన్ని వార్తలు