కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించిన ధోని!

2 Aug, 2019 12:34 IST|Sakshi

శ్రీనగర్‌ : పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకుగాను రెండు నెలలపాటు సెలవు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ప్రస్తుతం క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధోని ప్రస్తుతం భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి కాశ్మీర్ లోయలో రెండు నెలలపాటు సైన్యంతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగా ఉగ్రదాడులు ఎదుర్కొనే విక్టర్‌ ఫోర్స్‌ విభాగంలో సైనాధికారులు ధోనికి బాధ్యతలు అప్పగించారు.

ఈ నేపథ్యంలో ధోని ఉన్నతాధికారులతో కలిసి క్యాంపులో పాల్గొంటూ, సైనికులలో ఒకరికి బ్యాట్‌ మీద ఆటోగ్రాఫ్‌ చేస్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా 2011లో కల్నల్ హోదా పొందిన ధోని, అనంతరం పారా మిలటరీ రెజిమెంట్‌లో పని చేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ భారత పౌరుడు మిలటరీ యూనిఫామ్‌ ధరించాలనుకున్నప్పుడు అతనికి కేటాయించిన ఏ విధులనైనా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.  ధోని ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారని, క్రికెట్‌లో నిర్వర్తించిన విధంగానే ఇక్కడ కూడా తన విధులను బాధ్యాతయుతంగా నిర్వర్తిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు