ధోని.. ఈసారి పిచ్‌ను దున్నేశాడుగా..!

27 Feb, 2020 18:04 IST|Sakshi

రాంచీ: సుదీర్ఘ కాలం క్రికెట్‌లో తన బ్యాటింగ్‌, కీపింగ్‌లతో అలరించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ఇటీవల కాలంలో రోజుకో వేషంతో మనకు దర్శనమిస్తున్నాడు. తాజాగా ధోని పిచ్‌ను చదును చేసిన పనిలో పడ్డ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాంచీలోని జేఎస్‌సీఏ క్రికెట్‌ స్టేడియంలో తరచు ప్రాక్టీస్‌ చేసే ధోని.. తాజాగా పిచ్‌ రోలర్‌ డ్రైవర్‌ అవతారమెత్తాడు. పిచ్‌ను ఎలా చదును చేయాలో తెలుసుకున్న ధోని, తనకు అవకాశం దొరికిందే తడవుగా రోలర్‌ ఎక్కేసి పిచ్‌ను దున్నేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎంఎస్‌ ధోని ఫ్యాన్స్‌ అఫీషియల్‌ ట్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

మార్చి 2వ తేదీ నుంచి చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రాక్టీస్‌ ఆరంభించనున్న ధోని.. ముందుగానే రాంచీ స్టేడియంలో ఇలా వార్మమ్‌ చేస్తున్నట్లు కనబడుతోంది. ఐపీఎల్‌-13 కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) సన్నాహకాలను ప్రారంభించింది. ఇప్పటకే సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా, అంబటి రాయుడులతో పాటు మరికొంత మంది గత మూడు వారాలుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ ఆటగాళ్లతో ధోని మరో నాలుగు రోజుల్లో కలవనున్నాడు. రెండు వారాల కఠోర సాధన తర్వాత ధోని చిన్న విరామం తీసుకుంటాడు. అనంతరం అదే నెల 19 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్‌ క్యాంప్‌లో పాల్గొంటాడని, ఈ రెగ్యులర్‌ క్యాంప్‌లో ఆటగాళ్లందరూ పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు