'అందుకే రైనాను పక్కన పెట్టాం'

6 May, 2020 06:52 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దశాబ్దానికి పైగా తనదైన ముద్ర వేసిన సురేశ్‌ రైనా 2018 జూలైæ తర్వాత జట్టులోకి ఎంపిక కాలేదు. తనను తొలగించడానికి సెలక్టర్లు ఎలాంటి కారణం చూపించలేదని, ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకొని పునరాగమనం చేసే వాడినని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైనా వ్యాఖ్యానించాడు. దీనిపై నాటి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పందించారు. రైనా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.('టీమిండియాకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తా')

‘వేటు గురించి నేను స్వయంగా రైనాకు చెప్పాను. తిరిగి రావాలంటే ఏం చేయాలో కూడా వివరించాను. ఇప్పుడు అతను అలా ఎందుకు అంటున్నాడో నాకు తెలీదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్‌ ప్లేయర్‌ ఎవరైనా దేశవాళీలో అద్భుతంగా ఆడి తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో రైనా వెనుకబడ్డాడు. ఇతర యువ ఆటగాళ్లు, ‘ఎ’ జట్టు సభ్యుల ఆటతో పోలిస్తే రైనా ప్రదర్శన బాగా లేదు. మేం యూపీ రంజీ మ్యాచ్‌లు చూడలేదనే విమర్శలు కూడా అబద్ధం. నేను స్వయంగా రెండు మ్యాచ్‌లు చూశాను. రైనా ఆట సంతృప్తికరంగా లేదు’ అని ప్రసాద్‌ స్పష్టం చేశారు. 2018–19 రంజీ సీజన్‌లో యూపీ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన రైనా 2 అర్ధసెంచరీలతో 243 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ 17 మ్యాచ్‌లలో కేవలం 383 పరుగులు చేశాడు.
(అప్పటి నుంచి శిఖర్‌ అనే పిచ్చి పట్టింది నాకు..)

మరిన్ని వార్తలు