ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర

22 May, 2017 06:47 IST|Sakshi
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన రోహిత్ సేన తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.  చివర బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుంది. తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఈ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ గ్యాంగ్ గెలుపు అంచులవరకూ వచ్చి చతికిలబడింది.

ఆదివారం ఇక్కడ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ చిరస్మరణీయమైన విజయం సాధించింది.  చివరి మ్యాచ్ లో ఆద్యంత ఆకట్టుకున్న ముంబై బౌలర్లు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ముంబై బౌలర్లలో మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురైన పుణె పోరాడి ఓటమి చెందింది.  పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(44),స్టీవ్ స్మిత్(51) రాణించినా జట్టుకు విజయతీరాలకు చేర్చలేకపోయారు.

 

ఉత్కంఠ రేపిన చివరి ఓవర్‌

చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్‌ వేసిన తొలిబంతిని మనోజ్‌ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నించిన మనోజ్‌ లాంగ్‌ ఆన్‌ లో పోలార్డ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్‌ క్రీజులో  ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. మూడో బంతికి స్మిత్‌ కూడా భారీ షాట్‌ కు ప్రయత్నించి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ బై రన్‌ తీశాడు. బ్యాటింగ్‌ కు వచ్చిన క్రిస్టియన్‌ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో​ పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్‌ ముంబై సొంతమైంది.
 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరచడంతో ముంబైకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై మూడంకెల స్కోరుకు చేరగల్గింది.

మరిన్ని వార్తలు