బుమ్రా.. ఆర్సీబీకి వెళ్లిపోయాడా?

26 Oct, 2019 12:54 IST|Sakshi

ముంబై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వెళ్లిపోయాడా? ఇది ట్వీటర్‌లో ఒక అభిమాని సంధించిన ప్రశ్న. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లకు ఆ జట్టు యజమాని ముఖేష్‌ అంబానీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు.  ఈ కార్యక్రమానికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలతో పాటు పలువురు ఆటగాళ్లు హాజరయ్యారు. కోచ్‌ జయవర్ధనే సైతం అంబానీ ఇచ్చిన విందులో పాల్గొన్నాడు. 

దీనికి సంబంధించి ఫొటోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అందులో బుమ్రా కనిపించలేదు. దాంతో ఒక అభిమాని తనదైన శైలిలో చమత్కరించాడు. ‘ఏంటి.. బుమ్రా ఎక్కడా.. ఆర్సీబీకి వెళ్లిపోయాడా’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌కు ధీటుగా బదులిచ్చింది. ‘స్టే కామ్‌ మ్యాన్‌’  అంటూ రోహిత్‌ శర్మ ఉన్న జిఫ్‌ ఫైల్‌ను పోస్ట్‌ చేసింది.

తన అరంగేట్రం మొదలుకొని ఇప్పటివరకూ బుమ్రా తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. తొందరగానే టీమిండియా జట్టులో రెగ్యులర్‌ ఆటగాడి స్థానం సంపాదించుకున్న బుమ్రా.. ఐపీఎల్‌లో ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా, ఇటీవల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. నడమ కింది భాగంలో నొప్పితో సతమవుతున్న బుమ్రా కొన్ని రోజులుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఇచ్చిన విందుకు బుమ్రా గైర్హాజరీ అయ్యాడు.

>
మరిన్ని వార్తలు