దుమ్మురేపిన రాయుడు, పార్ధీవ్

25 Apr, 2016 21:57 IST|Sakshi
దుమ్మురేపిన రాయుడు, పార్ధీవ్

మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అంబటి రాయుడు, పార్దీవ్ పటేల్లు దుమ్మురేపారు. సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దూరు ఆటగాళ్లు రెచ్చిపోయారు. అంబటి రాయుడు(65; 37 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), పార్దీవ్ పటేల్(81; 58 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు.  దీంతో ముంబై ఇండియన్స్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్ధికి నిర్దేశించింది.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్  చేసిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగి ముంబై జట్టులో ఆందోళన రేకెత్తించాడు. ఆ తరుణంలో పార్ధీవ్ కు జతకలిసిన రాయుడు దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒకవైపు రాయుడు దూకుడను కొనసాగిస్తుంటే, మరోవైపు పార్దీవ్ నిలకడను ప్రదర్శించాడు.  ఈ జోడీ 85 బంతుల్లో 137 పరుగుల భాగస్వామన్ని నెలకొల్పిన అనంతరం రాయుడు రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం జోస్ బట్లర్(24; 13బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) స్కోరును పెంచే క్రమంలో మూడో వికెట్ అవుటయ్యాడు. ఇక చివర్లో పార్దీవ్, పొలార్డ్ (10), హార్దిక్ పాండ్యా(4) లు అవుట్ కావడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు సాధించగా, సందీప్ శర్మ, అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు